అష్ఠాదశ శక్తిపీఠాలు


దక్షయఙ్ఞ కార్యక్రమమే అష్ఠాదశపీఠాలకు ఏర్పడటానికి మూలం ఐనది. తాను జరపబోయే బృహస్పతియాగానికి దక్షుడు అందరిని ఆహ్వానిస్తాడు, తన కూతురు దాక్షాయణిని, అల్లుడు శివుడిని తప్ప. తన ఇష్టంతో సంబంధంలేకుండా దాక్షాయణి శివుడిని పెళ్ళాడటమే అందుకు కారణం. పిలుపు లేకుండానే, దాక్షాయణి యాగానికి వస్తుంది (పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవల్సిన అవసరంలేదు అనే ఉద్దేశ్యంతో ). అక్కడ దక్షుడు, ఇతరులు చేసిన శివనింద భరించలేక ఆమె యోగాగ్నికి ఆహూతైంది.

ఉగ్రరూపుడైన శివుడు, విషాదంతో దాక్షాయణి మృతదేహాన్ని భుజాన వేసుకొని, జగత్రక్షణ కూడా పక్కనబెట్టి, సంచరించసాగాడు. సృష్టి, స్థితి, లయంలో ఏ ఒక్కట్టి ఆగినా అనర్ధాలు ఏర్పడే అవకాశం ఉంది అనే ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, విష్ణుదేవుడు, శివుడిని కార్యోన్ముక్తుడు చేయుటకై, తన చక్రాయుధంతో దాక్షాయణి మృతదేహాన్ని ఖండాలుగా చేస్తాడు. ఒక్కోభాగము ఒక్కోచోట పడ్డాయి అవి పడిన ప్రతీచోట శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి.
అష్టాదశ శక్తిపీఠాల వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.


ఓం లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే 
అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా 
కొల్హా పురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా 
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా 
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ 
జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగల్య గౌరికా 
వారణాస్యం విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతీ 
అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రు వినాశనం 
సర్వరోగహరం దివ్యం, సర్వ సంపత్కరం శుభం





శాంకరిదేవి శ్రీలంక (మొలభాగం)
శాంకరి - శ్రీలంక - అమ్మవారి మొలభాగము పడినచోటు త్రికోణమలై (ట్రికోమలీ) శ్రీలంక. త్రి =3, కోణ = కోణం, మలై = కొండ, త్రికోణాకారంలో ఉన్న కొండ మీద అమ్మవారు ఉన్నారు. గుడి భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది. కోణేశ్వరం దేవాలయాన్నే తిరు కోణేశ్వరం అని పిలుస్తారు. కున అంటే తమిళంలో తూర్పు అని అర్ధం. 2500 సంవత్సారలకు ముందు విజయుడు ఇక్కడికి రాజుగా రావడానికి ముందే దేవాలయం వుందని నమ్ముతారు. దేవాలయ పరిసరాలలో బయల్పడిన అనేక విగ్రహాల ఆధారంగా ఈ ప్రాంతం పల్లవులదే నని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని పరిరక్షించడంలో చోళ పాంఢ్యులు తమ వంతు కృషి చేసారు. తమిళ రాజు కులోత్తముడు ఈ దేవాలయానికి మరమత్తులు చేయించాడని ప్రతీతి.


కామాక్షీ దేవి, కంచి (వీపు భాగం)
కామాక్షి - కాంచీపురం, తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆదిపరాశక్తి యోగపీఠంగానూ, కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

 అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది అని చెపుతారు.  కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసిందని పండితులు చెబుతున్నారు.






శృంఖలాదేవి, పశ్చిమబెంగాల్ (ఉదరభాగం)
శృంఖల - ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ - ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది. అష్టాదశ శక్తి పీఠాల్లో మూడోది శ్రీశృంఖలా దేవి క్షేత్రం. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖళా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి.

అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. పశ్చిమ బెంగాల్లో ఉన్న హుగ్లీ జిల్లాలోని "పాండువా" అనే ప్రాంతాన్ని శక్తిపీఠంగా అందరూ విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళలతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం ప్రత్యేకత.

మరొక కధనం ప్రకారం ...ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరు, కోల్‌కత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంగళాదేవిగా ( శృంఖలాదేవి) భావిస్తారు.

చాముండి, మైసూరు, (కురులు)
చాముండి - క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి. అమ్మవారి కురులు (శిరోజాలు) చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి పరమేశ్వరి, శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. "మహాబలాద్రి శిఖర" అనే కొండపై అమ్మవారు వెలిసారు కావున ఆ కొండ కాలక్రమములో చాముండికొండగా మారింది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.  మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది. ఈ శక్తిపీఠంలోనే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.







జోగులాంబ, అలంపూర్ (పైదవడ)
జోగులాంబ - ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ - కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది. మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు. జోగులాంబ ఉగ్ర రూపంలో ఉంటుంది, చతుర్భుజి గా కపాలము, గొడ్డలి, ఖడ్గము, పాన పాత్ర ధరించి, శవమును ఆశనముగా కలిగి, ఎడమవైపు తల తిప్పి మోకాళ్ళపై కూర్చొనిఉన్న ఒక శిరస్సు పై తన వృష్టభాగాన్ని ఆనించి, అరికాలు కనపడేలా ఎడమపాదం నేలపై ఆనించి, కపాలమును యఙ్ఞోపవీతంగాను, ఐదు ఆకులవలె వేలాడుతున్న కటిసూత్రం ధరించి ఉంటుంది. ఇది ఏడో అష్టాదశ పీఠం  పూర్వం హలంపురం అని పిలుపబడేదట. పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంలో ఉన్న ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉండటం విశేషం.


భ్రమరాంబిక, శ్రీశైలం (మెడభాగం)
భ్రమరాంబిక - శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ - కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి. అమ్మవారి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు అమ్మవారు తుమ్మెదరూపంలో (భమరము అంటే తుమ్మెద) అవతరించిందట. మల్లికార్జునము అంటే తెల్లటి మల్లే పువ్వు. ఆ దేవి ముఖారవిందంపై వాలిన తుమ్మెదల గుంపు ఆ రాక్షసుడిపై దాడి చేయటంతో ఆ రాక్షసుడు మరణించాడు. ఆ తల్లి భ్రమరాంబికగా వెలసి, మల్లికార్జునుని వరించి శ్రీశైలంపై కొలువైందని పురాణాలు చెబుతున్నాయి.   శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు. దీనిని ఎనిమిదో అష్టాదశ పీఠంగా పిలుస్తారు. .


మహాలక్ష్మి, మహారాష్ట్ర ( నేత్రాలు)
మహాలక్ష్మి - కొల్హాపూర్, మహారాష్ట్ర - కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నాలుగు చేతులతో అమ్మవారి నల్లరాతి విగ్రహం మూడు అడుగుల ఎత్తున ఉంటుంది. మహాలక్ష్మి అంటేనే విష్ణుపత్ని లక్ష్మి అనుకో కూడదు. 18 భుజాలతో రజోగుణంతో విలసిల్లుతున్న మహాశక్తి పార్వతీదేవి అని పండితులు అంటున్నారు.  అలనాటి కరవీర ప్రాంతమే ఈనాటి కొల్హాపూర్‌. అమ్మవారి నేత్రాలు పడిన ప్రదేశము. పూణెకు 240 కి.మి దూరంలో ఉత్తరాన కొల్హాపూర్‌ మహాలక్ష్మి ఆలయం ఉంది. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి కొల్హాసుర రాక్షస సంహారం అనంతరం ఈ కరవీరప్రాంతం కొల్హాపూర్‌గా రూపాంతరం చెందింది. హిందూ ఆలయాలు సహజంగా తూర్పు ఉత్తరదిశగా ఉంటాయి. కాని ఇక్కడ మహాలక్ష్మి ఆలయం పడమరదిశగా ఉంటుంది. 'ఇక్కడ మరో ప్రత్యేకతేమిటంటే ఆలయంలో పశ్చిమాన ఒకచిన్న గవాక్షం ఉంది. సంవత్సరంలో మార్చి, సెప్టంబర్ నెలల్లో సూర్యాస్తమయ సమయంలో 3రోజులు సూర్య కిరణాలు ఈ కిటికీగుండా ప్రసరించి అమ్మవారి ముఖంపై ప్రకాశిస్తాయి. ఈ 3రోజులు 'కిరణోత్సవాలుగా జరుపు కుంటారు. ఇది అష్టాదశ పీఠాల్లో ఆరోది


ఏకవీరిక - మాహుర్యం లేదా మహార్, మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును. అమ్మవారి కుడిచేయి పడినచోటు, మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రం. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు.
ఇంకో కధనం కూడా ఉంది :
జమదగ్ని ఆఙ్ఞచే, తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడు పరశురాముడు. ఆ శిరస్సు రూపంలో ఉన్న మాయా శక్తే " ఏకవీర ",  పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అనికూడాఅంటారు. మిగిలిన రేణుకాదేవి శరీరం, భూదేవిగా పూజలు అందుకొంటోంది.


మహాకాళి - ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శ్రీ మహంకాళీ దేవి క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడి ఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంత ఇదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది.


పురుహూతిక - పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాల్లో రెండోది శ్రీ పురుహుతికా దేవి క్షేత్రం రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి, శివుని అనుగ్రహం పొందాడు. ఏలుని తపస్సుతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు... వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు.

కానీ శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఇక్కడ అపరకర్మలు చేస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు.





గిరిజ - ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా - వైతరిణీ నది తీరాన ఉన్నది. అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.







మాణిక్యాంబ - దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
అష్టాదశ శక్తి పీఠాల్లో 16వ శక్తి పీఠమే ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాణిక్యాంబా దేవిగా పిలుస్తారు. ఇది అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన చోటుగా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం.








కామరూప/కామాఖ్యదేవి - హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. శ్రీ కామరూపీ దేవి శక్తి పీఠం:
అస్సాం గౌహతి సమీపంలోని నీలాచలపర్వతశిఖరంపై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.


మాధవేశ్వరి - ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో - ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు. అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వాడుకలోకి వచ్చింది. శ్రీ మాధవేశ్వరీ దేవి పీఠం: ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.


వైష్ణవి - జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ - ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి. అమ్మవారి నాలుక పడినచోటు, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతం. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన అమ్మవారు వైష్ణోదేవి. జగన్మాత శ్రీవైష్ణవిదేవి గుహలోపల కొలువుదీరి ఉంది. సుమారు 98 అడుగుల గుహలో గుహగోడపై శ్రీవైష్ణవీదేవి దర్శనమిస్తుంది.గుహలో కొలువుదీరిన జగన్మాత రాయి రూపంలో దర్శనమిస్తుంది. ఈ మూర్తిక్రిందిభాగం ఒకటిగానే ఉండి శిఖరస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మూడుగా విభజింపబడి ఉంటుంది. ఎడమవైపు తెల్లని భాగం శ్రీ సరస్వతిగా, మధ్యలోని పచ్చని భాగం శ్రీలక్ష్మిగా, కుడివైపున ఉన్న నల్లని భాగం శ్రీమహాకాళిగా చెప్పబడుతూ ఉంది.అంటే ఈమె ముగ్గురు శక్తుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరూపం. అమ్మవారు కొలువుదీరి ఉన్న గుహలో అమ్మవారి కంటే ముందే 'చరణ్ గంగా' ఉంది. ప్రవహిస్తూ ఉన్న ఈ నీటిలో భక్తులు కాళ్ళు కడుక్కుని అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ వైష్ణవి దేవీ క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపర్వతం నడమ పఠాన్‌కోటలో జ్వాలాముఖి రైల్వేస్టేషన్‌కు 20 కి.మి. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీ దేవి శక్తి పీఠం జమ్మూలో కాట్రాకు సమీపంలో ఉంది.


మంగళ గౌరి - గయ, బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు. అమ్మవారి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఫల్గుణీనదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు. శ్రీ మాంగల్యగౌరీ దేవి శక్తి పీఠం:
అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.


విశాలాక్షి - వారాణసి, ఉత్తర ప్రదేశ్. అమ్మవారి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి. అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ క్షేత్రం పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదానపుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశిగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశిగా పరిగణించబడుతోంది.. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసినదే విశాలాక్షి పీఠమని పురాణాలు చెబుతున్నాయి.


సరస్వతి - జమ్ము, కాష్మీరు - అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు. అమ్మవారి కుడిచేయి పడిన ప్రాంతం కాశ్మీర్లో ఉంది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.కాష్మీర్ లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. పాకిస్తాన్ వాళ్ళు (పాక్ ఆక్రమిత కాష్మీర్) ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేసారు. చాల భాదాకరమైన విషయం :(. కాష్మీరీ పండితుల విన్నపంతో రోజూ ఆ శిధిలమైన గుడి దగ్గరక దీపం పెట్టడానికి ఒక పురోహితుడిని మాత్రం అనుమతిస్తారని వినికిడి. శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం: కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణ హస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలు స్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.



అష్టాదశ పీఠాల్లో పద్దెనిమింటిని దర్శించుకోవడం అసాధ్యం. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏదేని ఒక క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.

అష్టాదశ శక్తి పీఠా ల్లో నాలుగు పీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి.
ఈ నాలుగు పీఠాలలోను అత్యుత్తమ మైనదిగా, బహుళ ప్రచారం లో ఉన్నది కర్నూలు జిల్లాలోని శ్రీశైలం. ఇది అమ్మవారి పరంగానే కాక శివుని పరంగా కూడా విశేష ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లిం గాలలో ఒకటిగా ఇక్కడ కొలువుదీరిన మల్లిఖార్జున స్వామికి విశేషమైన గుర్తిం పు ఉంది. తరువాత చెప్పు కోదగిన క్షేత్రం మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జోగులాం బ ఆలయం. మిగిలినవి... తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వెలిసిన పురుహూతికా దేవి, అదే జిల్లా ద్రాక్షారామంలో కొలువైవున్న మాణిక్యాంబా దేవి.

కామెంట్‌లు