అగ్గిరెక్కల మనిషి

నిప్పుు రెక్కల మిస్సైల్ ఒకటి కూలిపోవడం నేను చూసాను.
జ్ఞాన ఇంధనంతో స్వయంగా పై కెగసి
ఎన్నో దారితప్పె యంత్రాలను మంత్రవేసినట్లు దారిలోకి తెచ్చే
మిస్సైల్ ఒకటి కూలిపోవడం నేను చూసాను.

రత్నాలూ, భూషణాలూ,విభూషణాలకంటే
భాషణంలోనే మైమరచే ఆ గొంతు
గుండె చివరి గంట కొట్టేవరకూ మాట్లాడుతూనే కూలటం నేను చూసాను.

మైండ్స్ కి ఇగ్నీషన్ ఇచ్చిన మిస్సైల్
ఇరవై నాటికి ఇండియా ఇంకెంతో అవ్వాలనుకున్న మిస్సైల్
నాన్న పడవ ఒడినుంచి పరుగులెత్తి ప్రవహించి నింగిదాకా సాగిన మిస్సైల్
నిశ్శబ్ధంగా ఒక నిరామయ నిశీధిలోకి జారిపోవడం నేన్చూశాను.

రాష్ట్రపతి, కవి, శాస్త్రవేత్త అయితే మళ్ళీ దొరుకుతారేమో
ఒక మనిషిదనాన్ని నిండానింపుకున్న పరుగులెత్తే మిస్సైల్ రాలిపోవడాన్ని తడికళ్లతో చూసాను.
తనే ఒక పుస్తకమైన నిరంతర జీవనం ఆగిపోవడం చూసాను.
దేశపు కన్నీళ్ళ వర్షంలోంచి
కనీసం ఒక్క చిరుమొలక రావడాన్ని చూడాలి.
విత్తనాలు వెదజల్లిన ఆశయం చిరునవ్వై పూయడాన్ని చూడాలి.


28-జూలై-2015
నివాళిగా కవిసంగమంలో రాసిన కవిత

=> రత్న(1997), భూషణ్ (1981), విభూషణ్ (1990)
=> వింగ్స్ ఆఫ్ ఫైర్: ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ - ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అరుణ్ తివారీ
=> తండ్రి జైనులుద్ధీన్, పడవ యజమాని 

కామెంట్‌లు