దుర్ముఖి నామ సంవత్సరానికి సుముఖ స్వాగతం

ఉగాదితో కొత్త సంవత్సరం మొదలు శాలివాహన శకం తెలుగు క్యాలెండర్ ప్రకారం
మనం గ్రెగోరియన్ పద్దతిలో కాలాన్ని లెక్కించడానికి అలవాటు చేయబడ్డాం. ఇంగ్లీషు భాష అంతర్జాతీయ భాషగా పరిగణించబడుతున్నట్లే, ఇంగ్లీషు క్యాలెండర్ అంతర్జాతీయ క్యాలెండరై కూర్చుంది. అయితే శాస్త్రీయంగా అధ్యయనం చేసి అత్యంత ఉన్నత విలువలు వున్నదానినే ఆదునిక మానవుడు అడాప్ట్ చేసుకున్నాడా అంటే అబ్బే అలాంటిదేం లేదు.పోనీ నెలల పేర్లు పరిశీలించండి ఒక్కటన్న మనదేశ సాంస్కృతిక వారసత్వానికి సంభందించినది వుందేమో?
►జనవరి అనే నెల జానస్‌ అనే రోమన్‌ దేవత పేరున ప్రారంభమైంది.
►ఫిబ్రవరి అనేది ఫెబ్రువా అనే రోమన్‌ దేవత వల్ల వచ్చింది. ఇందులో మొదట 29 రోజులుండేవి కాని ఇందులోంచి ఒకటి తగ్గించి ఆగస్ట్‌లో చేర్చారు.
►మార్చ్‌ అనేది యుద్ధాలకు అధిదేవత అయిన కుజుడి పేరుతో (మార్స్‌) ఏర్పడింది.
►ఏప్రిలిస్‌ అనే మాట నుంచి ఏప్రిల్‌ నెల పేరు వచ్చింది. ఇది (అపెరీరె) ప్రారంభాన్ని సూచిస్తుందని అంటారు.
►మేయెస్తా అనే రోమన్‌ దేవత వల్ల మే నెల పేరు వచ్చి ఉండవచ్చు.
►జూన్‌ అనే పేరుకు రోమన్‌ దేవత జూనో కారణమనీ, జూనియస్‌ అనే తెగ కారణమనీ రకరకాల ప్రతిపాదనలున్నాయి.
► జూలై, ఆగస్ట్‌ నెలలకు పైన చెప్పినట్టుగా రోమన్‌ చక్రవర్తుల పేర్లు ఆధారం. మొదట్లో ► సెప్టెంబర్‌ ఏడో నెలగా ఉండేది. సంస్కృతానికీ, లాటిన్‌ భాషకూ పోలికలున్నాయి. సంస్కృతంలో ఏడు, ఎనిమిది వగైరా సంఖ్యలను సప్తమ, అష్టమ, నవమ, దశమ అంటారు కనక ఈ శబ్దాలను పోలిన పేర్లుగా
►సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ కనబడతాయి. మొత్తం మీద సూర్య చంద్రుల కదలికలోని తేడాలవల్ల నెలలన్నీ తలొక రకంగా రూపొందాయి. ఇది కాక నాలుగేళ్ళకొకసారి ఏడాదికి ఒక రోజు కలుపుకుంటూ ఈ నెలలగొడవలో లెక్కతప్పిన రోజు విషయాన్ని సరిచేసుకుంటుంటాం.

అసలు మనం కాలాన్ని ఎందుకు లెక్కిస్తాం. సంఘటనల మధ్య దూరాన్ని అంచనా వేయడానికి, దీనికోసం నిర్ధిష్టమైన మైలు రాళ్ళను పాతుకుంటేనే బావుంటుంది కదా.
ఒక రోజంటే
ఒక నెలంటే
ఒక సంవత్సరం అంటే వాటికి ఖచ్చితమైన కొలత పద్దతులు, బాగా వెనక్కో లేదా బాగా ముందుకో వెళ్ళి చూసినప్పుడు సరిగ్గా కనిపిస్తే బావుంటుంది కదా. మన గత చరిత్ర మొత్తం ఏ కాలపు పద్దతిలో కొలవబడిందో అర్దం కాకపోతే ఈ తేడాలు అసలే అర్ధంకావు.
పురాతన కాలంలో ఇప్పటి ఇరాక్‌ ప్రాంతంలో విలసిల్లిన సుమేరియన్‌ నాగరికతలో ఏడాదికి 12 నెలలనీ, నెలకు 30 రోజులనీ లెక్కించేవారు. ప్రాచీన ఈజిప్ట్‌లోనూ అదే పద్ధతి ఉండేది కాని చివరలో అదనంగా 5 రోజులు చేరుస్తూ ఉండేవారు. క్రీ.పూ.238లో నాలుగేళ్ళ కొకసారి ఒక రోజును చేర్చుకోవాలనే పద్ధతిని వారు ప్రవేశపెట్టారు. లీప్‌ సంవత్సరంగా ఇప్పటికీ అది అమలులో ఉంది.
క్రీ.పూ. ఏడో శతాబ్దం దాకా రోమన్‌ కేలండర్‌ పద్ధతిలో ఏడాది మార్చ్‌లో మొదలై పది నెలలపాటే కొనసాగేది. ఆ తరవాత జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చుకున్నారు. అయినప్పటికీ కొన్ని నెలలకు 29, కొన్నిటికి 30 చొప్పున రోజులుండేవి కనక అంతా తికమకగా తయారయింది. క్రీస్తు పుట్టుకకు 45 ఏళ్ళ క్రితం జూలియస్‌ సీజర్‌ అనే రోమన్‌ నేత ఈ వ్యవహారాన్ని సరిదిద్ది, ఇప్పుడు మనం పాటిస్తున్న పద్ధతిని ప్రవేశపెట్టాడు. తాను పుట్టిన తేదీని బట్టి ఆనాడు క్వింటిలిస్‌ అనే పేరున్న నెలకు తన పేరు పెట్టి జూలైగా మార్చాడు. అతని తరవాత అధికారం చేపట్టిన ఆగస్టస్‌ సీజర్‌ ఆ తరవాతి నెలను ఆగస్ట్‌గా మార్చాడు. ఈ జూలియన్‌ కేలండర్‌ లెక్కకూ, సూర్యుడి గమనానికీ 11 నిమిషాల పైగా తేడా ఉండేది. ఇలా వ్యక్తిగతమైన పేరును క్యాలెండరుకు రుద్దాలన్న తహతహ ఫలితం శతాబ్దాల పాటు పెరిగి కొంత గందరగోళం కలిగించింది.
పదహారో శతాబ్దంలో గ్రిగొరీ అనే రోమన్‌ మతాధికారి పోప్‌గా వ్యవహరిస్తున్నప్పుడు 1600 సంవత్సరాన్ని లీప్‌ సంవత్సరంగా నిర్ణయించాడు. ఈ గ్రిగోరియన్‌ పద్ధతిని అన్ని దేశాలూ అనుసరించడంతో ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఇందులో సంవత్సరాలన్నిటినీ ఏసు క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచీ లెక్కిస్తారు. దీనికి భిన్నంగా యూదు మతస్థులు గత 1200 ఏళ్ళుగా హీబ్రూ కేలండర్‌ను అనుసరిస్తున్నారు. వారి లెక్కన సృష్టి అనేది క్రీ.పూ.3761లో మొదలైంది. ఇస్లామ్‌ మతంలో క్రీ.శ.622 నుంచీ లెక్కిస్తారు. హిందూ పద్ధతిలో ప్రస్తుతం శాలివాహన శక సంవత్సరం 1928 నడుస్తోంది. ఇదే విక్రమ సంవత్సరం 2062 అవుతుంది.
శాలివాహన శకం క్రీ.శ 78 లో ప్రారంభమైంది. దీనికి ముందు విక్రమశకం క్రీ పూ 56 నుండి వాడుకలో వుండేది. శాతవాహనుల్లో 23వ రాజు అయిన గౌతమీ పుత్ర శాతకర్ణిని శాలివాహనుడు అనీ అంటారు. ఈయన తన పాలన కాలంలో అశ్వమేథ యాగం జరిపించాడు. భారత దేశం మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఈ యాగం జరిపించాడు. ఈ అశ్వాన్ని, శాలివాహనుడి బలగాన్ని ఎవ్వరూ అడ్డుకోకుండా అందరూ సామంతరాజులుగా మారారు. దీంతో భారత దేశం మొత్తాన్ని పాలించిన ఏకైక రాజుగా శాలివాహనుడు గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతీయ పంచాంగం (క్యాలెండర్‌) శాలివాహనుని పేరు మీదే ఈ నాటికీ చలామణి అవుతుంది. ఈయన నాణేలపై తన ముద్రను వేయించుకున్నట్లు ఆధారాలున్నాయి. దీన్ని బట్టి శాలివాహనుడు దృడకాయుడు, శత్రు భయంకరుడు, వైదిక విద్యాతత్పరుడుగా తెలుస్తుంది. ధర్మర్థాకామమోక్షాల పురుషార్థాల పట్ల భక్తి కలగవానిగా ఆయన తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్‌ శాసనం ఆధారంగానూ తెలుస్తుంది.
గౌతమీపుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) (పా. 78-106 CE) పశ్చిమ క్షాత్రప పాలకుడు, నహపాణ ను ఓడించి, శాతవాహనులు కోల్పోయిన ప్రాంతాలను తిరిగి చేజిక్కించుకొని వంశ ప్రతిష్ఠను పునరుద్ధరించాడు. ఈయన గొప్ప హిందూమతాభిమాని. శాలివాహనుడు తన శాసనములలో "శకులు (పశ్చిమ క్షాత్రప), యవనులు (ఇండో-గ్రీకులు) మరియు పల్లవులు (ఇండో-పార్థియన్లు) యొక్క నాశకుడు" అన్న బిరుదు స్వీకరించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి 78లో శక చక్రవర్తి విక్రమాదిత్యను ఓడించి శాలివాహన యుగం లేదా శక యుగానికి నాందిపలికాడు.
సరే ఇది క్యాలెండర్ ను పరిపాలకుడూ, ప్రభువు అయిన ఎవరి పేరుతో నడుస్తోంది అన్నది మాత్రం తెలుసుకుంటున్నాం. కానీ క్యాలెండర్ ఇలా వుండాలని తయారు చేసింది. ఒక్కరో చాలా మందో కానీ ఎంత పకడ్భందీగా మనం నివసిస్తున్న గ్రహగమనాన్నీ, సౌరకుటుంబంతో సంభందాన్నీ, సూర్యోదయం అస్తమయాలనూ, విషవత్తులనూ, ఆయనాలనూ, 12 గా విభజించిన రాశుల గుండా సూర్యుడి దుశ్య ప్రయాణాన్ని, చంద్రుడి గమనంతో సంభందాలనూ, అమావాస్య పున్నములనూ, గ్రహణ కాలాలనూ పంటలకు అనుకూలమైన నెలల గుర్తింపుని, మనిషి సగటు జీవిత కాలానికి అరవై వసంతాల చక్రభ్రమణపు పేర్లని ఖగోళ శాస్త్ర, వాతావరణ శాస్త్ర, వ్యవసాయ శాస్త్ర అవగాహనల కలయికగా తయారు చేయడం నిజంగా గొప్పవిషయంమే. మరి మనం ఇప్పుడు తప్పనిసరై వాడుతున్న క్యాలెండర్ ఎన్ని విషయాలను అర్ధం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది? ఏయే విషయాలలో ఎంతమేరకు శాస్త్రీయమైనది?

చైత్ర శుక్ల పాడ్యమి ఇలా సంవత్సరాదిగా (ఉగాదిగా) తరతరాలుగా జరుపుకుంటున్నారు. ఈ ఉగాదికి సంబంధించి ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. ఇది విక్రమార్క, శాలివాహనుల పరిపాలనకు సంబంధించినదిగా ప్రచారంలో ఉంది. వింధ్య పర్వతాలకు దక్షిణాన ఉన్నది శాలివాహన శకమని, ఉత్తరాన ఉన్నది విక్రమార్క శకమని ప్రచారంలోకి రావడానికి ఉన్న కారణాన్ని ఈ కథ వివరిస్తుంది.

పూర్వం పురంధరపురంలో ఓ వర్తకుడు ఉండేవాడు. గొప్ప ధనవంతుడైన ఆ వర్తకుడికి నలుగురు కుమారులు కలిగారు. కాలక్రమంలో వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైంది. అయినా ఆ వర్తకుడు తన నలుగురు కుమారులకు సంపదలను పంచి ఇవ్వలేదు. కానీ మరణించే ముందు తన నలుగురు కుమారులను పిలిచి మూతలు బిగించి ఉన్న నాలుగు పాత్రలను ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరిచి చూడమని, వాటిలో ఎవరు ఏ పని చేయాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు. అతడి కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరిచి చూశారు. మొదటి పాత్రలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు మాత్రమే కనిపించాయి. దాని అర్ధం వారికి తెలియక నాటి రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా చెప్పారు. విక్రమార్కుడికి కూడా ఆ ప్రాతల విషయం బోధపడలేదు. ఆ నలుగురు కుమారులు ఎలాగా అని ఆలోచించి ప్రతిష్ఠానపురం వెళ్ళి అక్కడున్న వారిని కూడా అడిగారు. కానీ ఎవరూ చెప్పలేకపోయారు. అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు.

ఆ బాలుడు ఓ వితంతువు కుమారుడు. అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చిందంటారు. ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయం ఇచ్చాడు. కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుడిని ప్రసవించింది. పుట్టిన బిడ్డకు శాలివాహనుడు అని పేరుపెట్టింది. శాలివాహనుడు నాలుగు పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు. వర్తకుడి కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపను, ఎముకలతో నిండిన పాత్ర వచ్చినవాడు పశుసంపదను, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన వాడు ధాన్యాన్ని పంచుకోవాలని, అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహనుడు తేల్చిచెప్పాడు. శాలివాహనుడి మాటలు నలుగురికీ నచ్చి అలాగే పంచుకున్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి విక్రమార్కుడి దాకా చేరింది. విక్రమారుడు శాలివాహనుడిని చూడాలని కుతూహలపడి కబురు చేశాడు. కానీ శాలివాహనుడు తాను రానని ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని అన్నాడు. దాంతో విక్రమార్కుడికి కోపం వచ్చి శాలివాహనుడిని సంహరించడానికి చతురంగ బల సమేతుడై వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీదకు పంపాడు. ఇద్దరి మధ్య భీకరంగా పోరు సాగింది. చివరకు శాలివాహనుడు సమ్మోహన శస్త్రాన్ని ప్రయోగించి విక్రముడి సేన అంతా నిద్రపోయేలా చేశాడు. విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజును ప్రార్ధించి తన సేనలకు మెలుకువ వచ్చేలా చేశాడు. ఆ తరువాత ఇద్దరికీ రాజీకుదిరింది.

ఈ కథకే మరి కొంత మార్పుతో మరి కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి. దాని ప్రకారం శాలివాహన, విక్రమార్కుల యుద్ధ సమయంలో ఎవరి విజయమూ తేలనప్పుడు ఆకాశవాణి వినిపించిందట. నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షణ దిక్కున ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి చెప్పిన తరువాత ఆ ఇద్దరూ యుద్ధాన్ని మానివేశారట. అలా శాలివాహనుడు ఒక శకానికి స్థాపకుడయ్యాడు. ఆ శక స్థాపన జరిగింది చైత్ర శుక్ల పాఢ్యమినాడనీ, ఆ అపూర్వ ఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతరకాలంలో ఉగాది ఆవిర్భవించిందని ప్రజల్లో ప్రచారంలో ఉంది.


తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు. 

అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

సరే ఇక పోతే సంవత్సరాల పేర్లు ఇది దుర్మఖి నామ సంవత్సరం కదా అసలే పేస్ వాల్యూతక్కువగా వున్నట్లుంది. కానీ గవర్నర్ గారు చెప్తున్నారు దుర్ముఖి నరసింహునిలా ఉగ్రరూపం కలది. కానీ అది చెడుని నిర్మూలించేందుకే అంటూ ..
మిత్రులందరికీ దుర్మిఖి నామ సంవత్సర శుభాకాంక్షలతో
మీ కట్టా శ్రీనివాస్
డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు గారి ఈనాడు వ్యాసం
డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గార్ల వ్యాసాలలో చర్చించిన అంశాలకు ధన్యవాదాలతో
ఫోటో లో కనిపిస్తున్న అంశాలు
1)ట్యాంకుబండుపై ఏర్పాటు చేసిన శాలివాహనుడి విగ్రహం
2) 1871 కాలం నాటి శాలివాహన శకం క్యాలెండర్ నకలు
3) 60 తెలుగు సంవత్సరాల పేర్లు

#Dhurmukhiఉగాదితో కొత్త సంవత్సరం శాలివాహన శకం తెలుగు క్యాలెండర్ ప్రకారం మనం గ్రెగోరియన్ పద్దతిలో కాలాన్ని ...

Posted by Katta Srinivas on Thursday, April 7, 2016





కామెంట్‌లు